ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా కాచిగూడలోని భద్రుక కళాశాలలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరు మన రాష్ట్రీయ భాష హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలన్నారు. నేను ట్యూషన్ పెట్టించుకుని మరీ హిందీ నేర్చుకుంటున్నానని అన్నారు.
హిందీ భాషకు ఉన్న విశిష్టత
ప్రధాని మోదీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా భారత రాష్ట్రీయ భాషా హిందీలోనే మాట్లాడుతున్నాడని తెలిపారు. హిందీ భాషకు ఉన్న విశిష్టతను ప్రపంచానికి తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారత ప్రతినిధిగా పాల్గొన్న వాజ్పాయ్ హిందీలో ప్రసంగించి ప్రపంచ దేశాల అధినేతలని ఆకట్టుకున్నాడని కొనియాడారు. ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో హింది నేర్చుకునేలా ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ ప్రారంభిస్తుందన్నారు.
కొంతమంది హిందీ సినీ నటులు
మమ్మీ అనే ఆంగ్ల పదం కన్నా, మాత అన్న హిందీ పదంలోనే ఎక్కువ మాధుర్యం ఉందన్నారు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మాతృభాషతో పాటు రాష్ట్రీయ భాషా హిందీని అలవాటు చేయాలన్నారు. కొంతమంది హిందీ సినీ నటులు హిందీలో సినిమాలు తీస్తూ.. వేదికలు, టీవీల్లో ఆంగ్లంలో మాట్లాడుతున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
40,700 విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుతుంటే 7,50,000 మంది మనవాళ్లు విదేశాల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. విదేశీ మోజు తగ్గేలా ఇండియాలో విదేశీ విద్యార్థులు వచ్చి చదివేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఇకనైనా మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా హిందీ భాషకు పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'ఒలంపిక్స్లో భారత్ అత్యధిక పతకాలు సాధిస్తుంది'