దక్షిణ అండమాన్ తీర పరిసర ప్రాంతాల్లో.. ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో భారీ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పెద్ద ఎత్తున వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
తీవ్రంగా ఈదురుగాలులు..
విశాఖ బీచ్ రోడ్డు, రైల్వే స్టేషన్, జ్ఞానాపురం, అక్కయ్య పాలెం, తాటిచెట్ల పాలెంతో పాటు గాజువాక, మధురవాడల్లో ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా కనిపించింది. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా రహదారులు జలమయమయ్యాయి.
ఏజెన్సీలో విరిగిపడిన చెట్లు..
విజయనగరం జిల్లాలో గాలివానకు.. అరటి, జీడి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా..
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో వర్షానికి చెట్లు విరిగి తీగలపై పడ్డాయి.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సరుబుజ్జిలి మండలం పాలవలసలో.. పిడుగుపాటుతో ఒకరు మృతిచెందారు.
ఇదీ చదవండి: ప్రాణాలను హరిస్తోన్న పుష్కరఘాట్లు.. కనిపించని రక్షణ చర్యలు