ప్రస్తుత పరిస్థితుల్లో ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. చిరుద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఎక్కువ మెుత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని పరిష్కారం కోసం హ్యాపీ హైదరాబాద్ సైకిల్ నిర్వాహకులు ముందుకొచ్చారు. ప్రాజెక్టు దియాను ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు దినేష్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఒక గొప్ప నిర్ణయంతో ముందుకెళ్తున్న తమకు అంతా కలిసివస్తుందని ప్రాజెక్ట్ దియా నిర్వాహకులు తెలిపారు. చాలా కష్టపడి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశామని వెల్లడించారు. వివిధ వృత్తుల్లో ఉన్న వారు ఇందులో వాలంటీర్లుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారు తమ పనులు చేస్తూనే... ప్రాజెక్టు దియాకు సహకరిస్తున్నారు. హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న సైకిళ్ల సేకరణకు పత్రిక ప్రకటనతో పాటు 9959771673 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. వాటికి మరమ్మతులను చేపట్టి... నిరుపేదలకు అందించటం జరుగుతుందని వివరించారు.
మేము రోజూ రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లేవాళ్లం. సైకిల్ కూడా కొనలేని పరిస్థితి. ప్రాజెక్టు దియా కింద సాయం పొందటం సంతోషంగా ఉంది. నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
-లక్ష్మి, సాయం పొందిన మహిళ
రాత్రి వేళ సెక్యూరిటీ గార్డులకు ఎలాంటి ప్రయాణ సౌకర్యం లేదు. అలాంటి వారికోసం ఈ సైకిళ్లను అందజేస్తున్నాం. నిరుపేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది.
-క్వీన్ విక్టోరియా, నిర్వాహకురాలు
సైకిల్ను చిన్న చిన్న పనులకు ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చిన్న చిన్న ఉద్యోగులు బస్సులు, ఆటోల్లో వెళ్లడం కష్టంగా మారింది. అలాంటి వారికోసం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ దియాను ప్రారంభించాం. నిరుపయోగంగా ఉన్న సైకిళ్లను సేకరించి... వాటికి మరమ్మతులు చేయిస్తున్నాం. ఆ రిపేర్లను రోడ్డు పక్కన ఉండే మెకానిక్ దగ్గరే చేయిస్తాం. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది.
-రాహుల్ ప్లిటా, నిర్వాహకుడు
ప్రాజెక్టు దియా పేరుతో వీలైనన్ని కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే తమ ధ్యేయమని నిర్వాహకులు తెలిపారు. దాతలు తమ వద్ద ఉన్న సైకిళ్లను తమకు అందజేయాలని నిరుపేదలకు ఆదుకునేందుకు తమ వంతు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: MURDER: వంద రూపాయల కోసం అన్ననే చంపాడు!