Gutta Sukhender Reddy as legislative Council Chairman: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి శాసన మండలి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఛైర్మన్గా ఎన్నుకున్నందుకు మంత్రులు, మండలి సభ్యులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికకు మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి సేవలను కొనియాడారు.
అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా...
దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయని... తెలంగాణ కౌన్సిల్లో మాత్రమే అర్థవంతమైన చర్చ జరుగుతూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని సభ్యులు కొనియాడారు. కౌన్సిల్ హౌస్ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. అధికారులు, ప్రభుత్వ పని తీరు కమిటీ సమావేశాల ద్వారానే తెలుస్తుందని సభ్యులు పేర్కొన్నారు.
ఆ ఇద్దరూ రైతులే!
వార్డు మెంబర్ నుంచి శాసన మండలి ఛైర్మన్గా గుత్తా అనేక సేవలు అందించారని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అంశాలపై గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించేవారమని గుర్తుచేసుకున్నారు. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలిలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు రైతులే అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులతో పాటు.. ఎక్కువ సభ్యులు ఉన్న అధికార పార్టీ సభ్యులకు కూడా మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని ఛైర్మన్ను కోరారు.
రెండు సభలు ఒక్కదగ్గరే ఉండాలి..
పెద్దల సభలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కౌన్సిల్కు అధికారుల హాజరు శాతం తక్కువగా ఉంటుంని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ పాత భవనంలోకి కౌన్సిల్ మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే... పార్లమెంట్ మాదిరిగానే అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఉంటూ సెంట్రల్ హాల్ను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు.
సభలో ముగ్గురే మహిళా సభ్యులు ఉన్నారని...మిగతా సభ్యులతో సమానంగా తమకు కూడా మాట్లాడే అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ప్రతి బిల్లుపై మహిళ సభ్యులకు మాట్లాడే సమయం.. ఇవ్వాలన్నారు.
ఇదీ చదవండి: Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ