కొవిడ్తో ప్రపంచంతోపాటు దేశమంతా కకావికలం అయ్యింది. లాక్డౌన్ అమలుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా సంభించిపోయాయి. ప్రభుత్వాలకు రావల్సిన రాబడులు రాలేదు. వ్యాపార, వ్యాణిజ్య సంస్థల నుంచి రావల్సిన పన్నులు ఏటికేడు పెరుగుదలే తప్ప తిరోగమనం అనేది ఉండదు. కానీ ఈ ఆర్ధిక ఏడాది ప్రారంభంలోనే కరనా ప్రభావంతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వస్తు సేవల పన్ను-జీఎస్టీ రాబడులు నెలకు రూ. రెండున్నర వేల కోట్లు వస్తుంది. అదే విధంగా పెట్రోల్ అమ్మకాలు ద్వారా మరో రూ. ఏడువందల కోట్లు, లిక్కర్ అమ్మకాలు ద్వారా ఇంకో రూ. ఎనిమిది వందల కోట్లు వ్యాట్ రాబడులు వస్తాయి. కానీ వైరస్ ప్రభావం ఈ రాబడులపై తీవ్రంగా పడింది.
రాష్ట్రానికి అత్యధిక రాబడులు తెచ్చి పెట్టే వాణిజ్య పన్నుల శాఖపై ఏలాంటి ప్రభావం పడింది..రాబడులు ఏలా తగ్గాయి తదితర అంశాలను పరిశీలిస్తే...
పెట్రోల అమ్మకాల ద్వారా వచ్చే వ్యాట్ | |||
నెల | 2019 | 2020 | తగ్గుదల శాతం |
ఏప్రిల్ | 673 కోట్లు | 181 కోట్లు | 73 |
మే | 611 కోట్లు | 111 కోట్లు | 82 |
లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చే వ్యాట్ | |||
నెల | 2019 | 2020 | తగ్గుదల శాతం |
ఏప్రిల్ | 680 కోట్లు | 0 | 100 |
మే | 800 కోట్లు | 495 కోట్లు | 38 |
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) | |||
నెల | 2019 | 2020 | తగ్గుదల శాతం |
ఏప్రిల్ | 2,375 కోట్లు | 483 కోట్లు | 80 |
మే | 1,823800 కోట్లు | 954 కోట్లు | 48 |
జూన్లో కొంత మెరుగుపడే అవకాశం
గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.4197 కోట్లు మేర జీఎస్టీ రావాల్సి ఉండగా రూ.1437 కోట్లు మాత్రమే వచ్చింది. కొవిడ్ ప్రభావంతో వ్యాట్, జీఎస్టీ రాబడులు జూన్ నెలలో కొంత మెరుగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. లాక్డౌన్ సడలింపుతో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండటం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు సాధారణ పరిస్థితుల్లోకి రావడం, వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నందున గడిచిన రెండు నెలల కంటే కూడా జూన్ నెలలో మెరుగ్గా ఉంటాయని లెక్కలు గడుతున్నారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక నజర్
అక్రమ రవాణాపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ అధికారులను ఆదేశించారు. డివిజన్కు రెండు లెక్కన ప్రత్యేక బృందాలు ఏర్పాటై రాత్రి పగలు తేడా లేకుండా వాహనాలన తనిఖీలు చేయడంతో అక్రమ రవాణా తగ్గి రాబడులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.