జులై నెలాఖరువరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్ వీ టీకా డోసులు దిగుమతి చేసుకుంటామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు దిగుమతి, దేశంలో తయారీ 15 నుంచి 20 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. రెడ్డీస్ ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి వస్తున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.
టీకాతోనే శాశ్వత రక్షణ ఉంటుందన్న గవర్నర్... కొవిడ్ పోరాటంలో వ్యాక్సిన్ శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని అన్నారు. టీకాల తయారీదారులు అన్ని రకాల చర్యలతో ఉత్పత్తిని వేగవంతం చేయాలని తమిళిసై సూచించారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి డీఆర్డీఓ సంయుక్త భాగస్వామ్యంతో 2 డీజీ ఔషధం రావడం, సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఆశయానికి అనుగుణంగా ఉందని ప్రశంసించారు. చిన్న పిల్లల కోసం వ్యాక్సిన్ ప్రయోగాలు త్వరగా విజయవంతం చేసి కొవిడ్ బారి నుంచి వారిని కాపాడాలని సూచించారు.
ఇదీ చదవండి: కేటీఆర్ చొరవ.. ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సేవలు యథాతథం