రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుపై గవర్నర్ తమిళిసై ప్రస్తావించారు. గతంలో గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ సమయంలోనూ ఈ పథక అమలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఉన్నాతాధికారులతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
2లక్షల నుంచి 5లక్షల వరకు...
ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో 946 రకాల వైద్య సేవలు అందిస్తుండగా.. ఆయుష్మాన్ భారత్ అమలైతే వాటి సంఖ్య 1,350కి పెరగనున్నట్లు కేంద్ర అధికారులు వివరించినట్లు సమాచారం. ఒక్కో కుటుంబానికి ఆరోగ్య శ్రీ కింద రూ. 2లక్షల వరకు వైద్య సేవలు అందిస్తుండగా అది 5 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
శస్త్రచికిత్సలు ఆరోగ్య శ్రీ కిందే...
అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ కిందే కొనసాగించే వెలుసుబాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్లో వైద్య సేవల ధరలు తక్కువగా ఉన్నట్లు గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ధరలనే యథాతథంగా కొనసాగించే వీలు కల్పిస్తామని తెలిపినట్లు సమాచారం.
వైద్య సేవలకు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం నుంచి కొంత మొత్తంలో ఆర్థికంగా నిధులు సమకూరుతాయని కేంద్ర ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు సమాచారం. గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ భేటీలో వచ్చిన సూచనలను ముఖ్యమంత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీచూడండి: వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష