కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. ఏపీ తెదేపా నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బం హరికి కొవిడ్తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందించినా.. ప్రయోజనం లేకపోయింది.
సబ్బం హరి స్వస్థలం తగరపువలస సమీపంలోని చిట్టివలస. 1952 జూన్ 1న జన్మించారు. ఆయనకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం ఇదీ..
సబ్బం హరి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైంది 1985లో విశాఖ నగర యువజన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన ఆయన.. 1989 ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించారు. 1995లో ఆయన విశాఖ మేయర్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో విశాఖ నగర అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో తెదేపాలో చేరారు. ఆ తర్వాత భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
చంద్రబాబు సంతాపం
సబ్బం హరి మరణం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు, విశాఖ తెదేపా కార్యాలయంలో పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు.