విజయవాడలో వందల టన్నుల్లో వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. దాని నిర్వహణ నగరపాలక సంస్థకు భారంగా తయారైంది. తడి చెత్తను ఎరువుగా మార్చి ఉద్యానవనాలకు ఉపయోగిస్తున్నారు. పొడి చెత్త అవసరమైన మేర తిరిగి ఉపయోగిస్తున్నారు. ఇలా పునర్వినియోగానికి వీల్లేని టైర్లు, ప్లాస్టిక్ సంచులను నగర శివార్లలోని అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ఇలా తరలించిన చెత్త డంపింగ్ యార్డులో భారీగా పేరుకుపోతోంది. ఈ నిల్వలను కరిగించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో కలిసి నగరపాలక సంస్థ చర్యలు చేపడుతోంది. దీన్ని ఇంధనంగా వాడుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణ 2016 చట్టాన్ని అమలు చేసింది.
అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం ముందుకొచ్చి నగరపాలక సంస్థ-జగ్గయ్యపేట పురపాలక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ చెత్తను ఇంధనంగా వినియోగించుకునే ఒప్పందం కుదుర్చుకుంది. రోజుకు 25నుంచి 30 టన్నుల చెత్త తరలించనుంది.
ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో నిత్యం 500 టన్నులకుపైగా చెత్త పోగవుతోంది. ఇందులో నుంచి రోజుకు 25 నుంచి 30 టన్నులు అల్ట్రాటెక్ పరిశ్రమ... సిమెంట్ ఉత్పత్తికి ఇంధనంగా వాడుకోనుంది. 2023 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు 110 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: రాష్ట్రంలో 150 కొత్త పంచాయతీల ఏర్పాటుకు సన్నాహాలు