రాష్ట్రంలో ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యాక పాఠశాలల్లో 195 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ హైకోర్టుకు(covid report to high court) వివరించింది. సెప్టెంబరు 1 నుంచి ఈనెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3 వేల 109 పాఠశాలల్లో 6,84,010 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. విద్యార్థులను సమీప ఆస్పత్రులకు తరలించి.. వారితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా పరీక్షలు చేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు(dh Srinivasa rao report in high court) హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒక్క డోసు టీకా కూడా వేసుకోని వారు 42,44,569 మంది ఉన్నారని డీహెచ్ హైకోర్టుకు(dh report on covid vaccine) తెలిపారు. వారిలో 45 ఏళ్లు పైబడిన వారు 6,17,827 మంది ఉండగా.. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారు 36,26,722 మంది ఉన్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారు 2 కోట్ల 77 లక్షల 67 వేల మంది ఉండగా.. ఈనెల 11 నాటికి కోటి 8 లక్షల 51 వేల 873 మంది రెండు డోసులు వేసుకోగా.. మరో కోటీ 26 లక్షల 70 వేల 558 మంది ఒక డోసు వేసుకున్నారని డీహెచ్ తెలిపారు. జనవరి 16 నుంచి ఈనెల 11 నాటికి 3 కోట్ల 66 లక్షల 89 వేల 830 డోసులు రాష్ట్రానికి వచ్చాయని.. ప్రస్తుతం 60 లక్షల 58 వేల 430 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు(dh on covid vaccine) పేర్కొన్నారు.
తగ్గిన పాజిటివిటీ రేటు
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.4 శాతానికి తగ్గిపోయిందని డీహెచ్ శ్రీనివాసరావు(dh srinivasa rao on corona) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రభుత్వ, 76 ప్రైవేట్ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు.. 1231 కేంద్రాల్లో రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు జరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొవిడ్ చికిత్సల కోసం 1327 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 55,442 పడకలు అందుబాటులో ఉన్నాయని డీహెచ్ ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకలన్నీ కలిపి 2.6 శాతం అంటే.. 1527 మాత్రమే నిండాయన్నారు.
జ్వరం సర్వే కొనసాగుతోంది: డీహెచ్
రాష్ట్రంలో మే 6 నుంచి జ్వరం సర్వే కొనసాగుతోందని డీహెచ్ శ్రీనివాసరావు(dh on fever survey) హైకోర్టుకు నివేదించారు. ఆస్పత్రుల్లోని ఓపీల్లో ఈనెల 11 నాటికి కోటీ 34 లక్షల 10 వేల 931 మందిని పరీక్షించగా.. 8 లక్షల 17 వేల 362 మందిలో జ్వరం లక్షణాలు గుర్తించనట్లు వివరించారు. వారిలో 7 లక్షల 90 వేల 125 మందికి చికిత్స కిట్లను పంపిణీ చేసినట్లు నివేదికలో తెలిపారు. ఇంటింటి సర్వేలో భాగంగా 5 లక్షల 77 వేల 636 మంది జ్వరం లక్షణాలు గుర్తించి.. వారిలో 5 లక్షల 68 వేల 225 మందికి కిట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మూడో దశలో పిల్లలకు ముప్పు ఎక్కువగా ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో.. చిన్నారుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల పడకలు ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఆక్సిజన్ ఇతర సదుపాయాలను కూడా సమకూర్చుకున్నామని.. వైద్య, పారామెడికల్ సిబ్బందికి పిల్లలకు అందించే కొవిడ్ చికిత్సపై ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు డీహెచ్ వివరించారు.
ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేదు
రాష్ట్రంలో 82 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు నివేదికలో డీహెచ్ శ్రీనివాసరావు(dh srinivasa rao in high court) తెలిపారు. ప్రస్తుతం 75 చోట్ల పనిచేస్తున్నాయని.. మరో ఏడు కూడా ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 50 ఆక్సిజన్ ప్లాంట్లను పీఎం కేర్స్ కార్యక్రమం కింద సమకూర్చుకోగా.. విరాళాల ద్వారా మరో 32 ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 453 కిలోల లిక్విడ్ ఆక్సిజన్తో పాటు.. సుమారు 9వేల సిలిండర్లు ఉన్నాయన్నారు. కొవిడ్ మృతులకు కేంద్రం ప్రకటించిన 50 వేల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లింపునకు ఏర్పాట్లు చేశామన్నారు.
హైకోర్టు సంతృప్తి
కరోనా నియంత్రణ చర్యలపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం అన్నీ చేయలేదని.. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: