భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ 70శాతానికిపైగా చైనా సంస్థలపైనే ఆధారపడి ఉంది. కొవిడ్-19 ప్రభావంతో చైనాలో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి దాదాపు 12శాతం పడిపోయింది. భారతీయ మొబైల్ మార్కెట్లో 28 శాతంతో షామీ మొదటి స్థానంలో ఉండగా... వివో 21 శాతం, ఒప్పో 12శాతం, రియల్మీ 8శాతం, వన్ ప్లస్ 4శాతం మార్కెట్ను కలిగి ఉన్నాయి. చైనా మొబైళ్ల తర్వాత దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ మాత్రమే 19 శాతం మార్కెట్తో గణనీయమైన మార్కెట్ను కలిగి ఉంది.
చైనా ఉత్పత్తులపై పెను ప్రభావం
కొవిడ్-19 వైరస్ ప్రభావం చైనా ఉత్పత్తులపై పడింది. మెమోరీ కార్డులు, సెన్సర్లు, చిప్లు, ఇతర విడిభాగాల సంస్థలు.. కరోనా కేంద్రీకృతమైన వుహాన్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. చైనాలో చాలా సంస్థలు ఉత్పత్తి నిలిపివేశాయి. తమ నూతన ఉత్పత్తుల విడుదల ప్రణాళికలను సమీక్షించుకుంటున్నాయి.
భారత మార్కెట్లో శాంసంగ్ టాప్బ్రాండ్
మోడళ్ల కోసం బీఐఎస్లో రిజిస్ట్రేషన్లు, మార్కెట్ లాంచింగ్కు పోటీపడుతున్నాయి. ఒకప్పుడు భారత మార్కెట్లో టాప్బ్రాండ్గా ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడోస్థానానికి పడిపోయింది.
మార్చికల్లా సంక్షోభం..?
కొవిడ్-19 ప్రభావం వల్ల ప్రస్తుతం నిల్వ ఉన్న స్టాక్తోనే ప్రస్తుత మార్కెట్ నెట్టుకునే పరిస్థితి తలెత్తింది. డీలర్లకు సైతం డిస్ట్రిబ్యూటర్లు నో స్టాక్ సంకేతాలు ఇచ్చారు. మార్చికల్లా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
విడిభాగాల తయారీపై ప్రత్యేక దృష్టి
షామీ, వివో, ఒప్పో తయారీ యూనిట్లలో... చైనా నుంచి వచ్చే విడిభాగాలను అమర్చి భారత్లో సరఫరా చేస్తున్నారు.
కేవలం విడిభాగాల అసెంబ్లింగ్ యూనిట్లా కాకుండా.. కొత్త స్మార్ట్ ఫోన్లు, వాటి తయారీకి కావాల్సిన విడిభాగాల తయారీపై దృష్టి పెడితే ఇటువంటి స్తబ్ధత వచ్చినప్పుడల్లా దిగుమతులపై... ఇతర దేశాలపై ఆధారపడే వెతలు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ సంస్థలు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో దూసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: కొత్త జీహెచ్ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష