పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న రాజ్ భవన్ ముట్టడి... వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. విడతల వారీగా కార్యకర్తలు, నాయకులు ముట్టడికి యత్నిస్తున్నారు. ఖైరతాబాద్ వైపు నుంచి ఆటోలో వచ్చిన నాయకులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. విడతల వారీగా దాదాపు 50మంది కార్యకర్తలు రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. కార్యకర్తలను అదుపులోకి తీసుకొని గోషామహల్ పోలీసు మైదానానికి తరలించారు.
పోలీసుల పటిష్ఠ బందోబస్తు
రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చినందుకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ వైపు వెళ్లే దారుల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీ చేసి పంపించారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసిన వెంటనే ఖైరతాబాద్ చౌరస్తా వద్ద బారికేడ్లు మూసేశారు.
వాహనాల దారి మళ్లింపు
కాంగ్రెస్ నేతలు ఒకవేళ మూకుమ్మడిగా వస్తారనే ఉద్దేశంతో ఖైరతాబాద్ - రాజ్ భవన్ రహదారిపై రాకపోకలు నిలిపేశారు. రాజ్భవన్ మీదుగా వెళ్లే వాహనాలను పంజాగుట్ట మీదుగా దారి మళ్లించారు. శాంతిభద్రతల అదనపు సీపీ చౌహన్, సంయుక్త సీపీ ఏఆర్ శ్రీనివాస్ రాజ్ భవన్ వద్దే ఉండి బందోబస్తును పర్యవేక్షించారు.
మీరూ మాతో జాయినవ్వండి
పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా ప్రజల తరఫున వినతిపత్రం ఇస్తామనటంతోనే.. గవర్నర్ తమిళిసై పుదుచ్చేరికి వెళ్లారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆన్లైన్లో వినతిపత్రం సమర్పించాలని అధికారులు చెబుతున్నారని తెలిపారు. తమకు మోదీ, గవర్నర్, సీఎం మీద నమ్మకాలు పోయాయని... తాము నమ్మేది రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహేబ్ అంబేడ్కర్నేనని పేర్కొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి.. తమ బాధ తెలియజేసేందుకు శాంతియుతంగా వెళ్తామన్న రేవంత్... తమకు పోలీసులు సహకరించాలని కోరారు. తామూ... తమ కార్యకర్తలు ర్యాలీగా... క్షమశిక్షణతో వెళ్తామని... కావాలంటే పోలీసులు కూడా నిరసనలో పాల్గొనొచ్చన్నారు. పోలీసులకు కూడా జీతాలు పెంచుతామని, వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చేయలేదని.. దానికి నిరసనగా ర్యాలీలో భాగస్వామ్యం కావాలని రేవంత్ సూచించారు.
ఇదీ చూడండి: Revanth Reddy: 'అబద్ధాలతో మభ్యపెట్టి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు'