CM Jagan on Arogyashri treatment: ఏపీలో వైద్యఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు లేకుండా చర్యలు చేపట్టడంతో... ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీలో కొత్తగా 809 చికిత్సలను చేర్చే ప్రక్రియను సీఎం ప్రారంభించారు. ఇప్పటివరకు 2వేల 446 రకాల చికిత్సలు అందిస్తుండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3వేల 255కి చేరినట్లు చెప్పారు.
పేదలకు వైద్యం అందించడంలో అలసత్వానికి తావులేదన్న సీఎం.. ఆస్పత్రుల్లో అవసరమైనంత మంది వైద్యులు ఉండాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుతో ఏడాదికి రూ.2వేల 894.87 కోట్లు ఖర్చు కానుండగా, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో ప్రతి ఒక్కరి హెల్త్ హిస్టరీ నిక్షిప్తం చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్ విధానం విజయవంతంగా అమలు చేయవచ్చన్నారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్పై సీఎం ఆరా తీయగా.. అక్టోబర్ 21 నుంచి ట్రయల్ రన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు సహా మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారని ముఖ్యమంత్రికి నివేదించారు. మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో సుమారు 46వేల పోస్టులు భర్తీ చేసినట్లు సీఎం వివరించారు. ఎప్పుడు, ఎక్కడ ఖాళీ ఉన్నా వెంటనే గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు గుర్తు చేశారు.