హైదరాబాద్లోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండు రోజు పర్యటిస్తోంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నాయకత్వంలో కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎం.రఘురామ్, కేంద్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.కె. కుష్వారా నగరంలో సందర్శిస్తున్నారు.

నాగోల్, బండ్లగూడ చెరువుల నుంచి ఓవర్ ఫ్లో అయి నాలాల్లోకి వస్తున్న వరద నీరు, ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎల్బీ నగర్ జోన్ హయత్ నగర్ సర్కిల్, నాగోల్ రాజరాజేశ్వరి కాలనీ, అయ్యప్ప కాలనీ, మల్లికార్జున నగర్, మన్సురాబాద్, చింతలకుంట, బైరామల్ గూడ, రెడ్డి కాలనీల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. వర్షాలతో పైన ఉన్న చెరువుల నుంచి వచ్చిన వరదతో నాగోల్ ప్రాంతంలోని పలు కాలనీలు, ఇళ్లు సుమారు 6 అడుగులు మేర నీటి ముంపునకు గురయ్యాయని కేంద్ర కమిటీకి బాధిత కుటుంబాలు విన్నవించాయి.

ఈ ప్రాంతానికి మూసి నది ఒక కిలోమీటర్ దూరంలో ఉందని.. వరదతో పాటు పైన ఉన్న అన్ని చెరువులను అనుసంధానం చేస్తూ, ఓవర్ ఫ్లో అయ్యే నీటిని మూసి నదిలో కలిపేందుకు నాలాను ఏర్పాటు చేయనున్నట్లు నీటి పారుదల, జీహెచ్ఎంసీ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మూసీకి కలుపుతూ నాలాను విస్తరింపజేసేందుకు అనువైన డిజైన్ల తయారీకి కన్సల్టెన్సీకి అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్రబృందం