ఆరేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన విషయాలను ప్రస్తావిస్తూ కేటీఆర్కు భాజపా ఎమ్మెల్సీ రాంచందర్రావు బహిరంగ లేఖ రాశారు. తాను ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉన్నానని వివరించారు. ప్రజా సమస్యలను మండలిలో లేవనెత్తడమే తన పాత్ర అన్నారు. న్యాయవాదుల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన 100 కోట్ల కార్పస్ ఫండ్ సమస్యను చాలాసార్లు ప్రస్తావించానని ఆయన పేర్కొన్నారు.

తెరాస నేతల ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని.. సమస్యలపై చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు. ఏడేళ్లుగా మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారని మంత్రిని ప్రశ్నించారు. యూనివర్సిటీలకు వీసీలను ఎందుకు నియమించలేదన్నారు. యాభై వేల ఉద్యోగాలు, గ్రూప్స్ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతిపై సమాధానం చెప్పాలని లేఖలో రాంచందర్ రావు డిమాండ్ చేశారు.