రాష్ట్ర రాజధానిలో బిక్షాటన మాఫియా ఆగడాలు మరోసారి బయటపడ్డాయి. నాలుగు నెలల చిన్నారిని అపహరించిన 14 గంటల్లోనే పోలీసులు ముఠాకు చెందిన ముగ్గురిని పట్టుకున్నారు.
సీతారాంబాగ్కు చెందిన లక్ష్మి స్థానిక కట్టెల మండిలో నివసిస్తోంది. భర్తతో మనస్పర్థలు రావడం వల్ల నాలుగు నెలల చిన్నారితో కలిసి ఉంటోంది. ఈ నెల 11న అర్ధరాత్రి లక్ష్మి నిద్రలో ఉండగా.. మంగళ్హాట్కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ అలీం చిన్నారిని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అలీం తన భార్య అష్రియాకు పాపను ఇవ్వగా.. ట్రాఫిక్ కూడళ్ల వద్ద బిక్షాటన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు వారి బంధువు షేక్ సలీం కూడా సహకరిస్తానన్నాడు.
ఈ క్రమంలో బాలిక తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆటోలో చిన్నారిని అపహరించుకుపోతున్న షేక్అలీంను గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా బండారం బయటపడింది. ఫలితంగా ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు.
చిన్నారి అపహరణ కేసును 14 గంటల్లోనే చేధించడంతో మంగళ్హాట్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
ఇదీచూడండి: సైబర్ నేరాలకు చెక్.. ఆ ఆన్లైన్ పోర్టల్కు నోటీసులు..!