కువైట్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వలస కార్మికులను స్వస్థలాలకు రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్కు ఈ మేరకు లేఖ రాశారు. వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆ మిషన్ ప్రశంసనీయం
విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను వెనక్కి రప్పించేందుకు 'వందే భారత్ మిషన్' పేరుతో కేంద్రప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని జగన్ అన్నారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది భారతీయులు దీన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారని తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకున్న వేలాది వలస కార్మికులు స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని.. వారంతా వచ్చేందుకు అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని లేఖలో వివరించారు. కువైట్లో కనీస సదుపాయాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
ఆ ఖర్చు కువైట్ భరిస్తుంది
వీరి ప్రయాణ ఖర్చు భరించేందుకు కువైట్ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని.. కువైట్ హై కమిషనర్ సహా అధికారులతో మాట్లాడి వారిని ఏపీకి రప్పించే ఏర్పాట్లు చేయాలని జగన్ కోరారు. విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారందరికీ క్వారంటైన్ సదుపాయంతో పాటు, తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివరించారు. కువైట్తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలస కార్మికులను వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి అనుమతించాలని లేఖలో కోరారు.
ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే