రాష్ట్రంలో కరోనా కేసులు 7 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే 546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 6 నాటికి 3,496 కేసులు ఉండగా, శనివారం ఈ సంఖ్య 7,072కి చేరింది. కేవలం 14 రోజుల్లోనే పాజిటివ్ కేసులు రెండింతలు అయ్యాయి. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా పరీక్షలు పెరుగుతుండటంతో అదే స్థాయిలో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం 3,188 మంది నమూనాలు పరీక్షించారు. జీహెచ్ఎంసీలో కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 458 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 200 మార్కును దాటింది. శనివారం నాటికి 203 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని శనివారం 154 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,506కి చేరింది. మరో 3,363 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోఠిలోని వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొందరికి పాజిటివ్ రావడంతో అక్కడ పనిచేస్తున్న ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఆ ఇద్దరు ఐపీఎస్లకు నెగిటివ్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులకు మలి విడత పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. ఈ ఇద్దరు అధికారులకు మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. తగిన జాగ్రత్తలు తీసుకున్నా, ఎందుకు వైరస్ బారినపడ్డామన్న అనుమానంతో వారిద్దరూ 24 గంటల వ్యవధిలో మరోసారి నమూనాలు ఇచ్చారు. శనివారం రాత్రి నెగిటివ్ అని రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఇవీ చూడండి: 'అక్రమ నిర్మాణాలను తొలగించలేరా?'