రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి రైతుబంధు (Raithu Bandu) పథకం కింద రెండు రోజుల్లో రూ. 1,669.42 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి (Niranjan Reddy) తెలిపారు. రెండో రోజు 15.07 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,152.46 కోట్లు జమ చేసినట్లు స్పష్టం చేశారు. రేపు 10.40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,272.85 కోట్లు జమ కానున్నాయని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
మూడు రోజుల్లో 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు (Raithu Bandu) కింద 58.85 లక్షల ఎకరాలకుగాను రూ. 2,942.27 కోట్లు అందజేసినట్లు అవుతుందని ప్రకటించారు. మూడో రోజు నల్లగొండకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ. 98.29 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి అన్నారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3,701 మంది పట్టాదారులకు రూ. 4.45 కోట్లు జమ అవుతాయని తెలిపారు.
ఈనెల 25 వరకు రైతులకు రైతుబంధు (Raithu Bandu) నిధుల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి సహా కంది అధికంగా సాగు చేయడంతోపాటు రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగు కూడా పెంచాలని సూచించారు. వినియోగదారుల అవసరాలు, అభిరుచులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యవసాయ పంటల సాగు వైపు రైతులు ప్రత్యేకమైన దృష్టి సారించాలని మంత్రి నిరంజన్రెడ్డి (Niranjan Reddy) పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు