ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త కస్తాల అరుణ్కుమార్ ఆ చట్టం కింద రాష్ట్రపతికి లేఖ రాశారు. స్పందించిన రాష్ట్రపతి భవన్ కార్యాలయం ప్రత్యుత్తరం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించాలని సూచిస్తూ.. పంపించిన లేఖ తాజాగా అరుణ్కుమార్కు అందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 రోజుల్లో సంతృప్తికరమైన సమాధానం రానట్లయితే ఆర్టీఐ అప్పీలేట్ అధికారికి.. అప్పీల్ చేసుకోవాలని లేఖలో సూచించింది. ఇదే విషయమై రాష్ట్ర గవర్నర్కు అరుణ్కుమార్ మళ్లీ లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రానట్లయితే అప్పీల్కు వెళ్తానని లేఖలో పేర్కొన్నాడు.
సమాధానాలు కోరుతూ లేఖ..
మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఎందుకైందని.. ప్రభుత్వం తెస్తున్న కొత్త జీవోలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేనందున వాటిపై విచారణ జరపాలని లేఖలో కోరాడు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలంతా భయాందోళనకు గురవుతుంటే.. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట 131 జీవో తేవడానికి కారణాలేంటో వెల్లడించాలని లేఖలో కోరారు. అంతకుముందున్న మిగులు నిధుల వినియోగంపై... సర్పంచ్, ఎమ్మెల్యే మొదలుకొని ఐఏఎస్ అధికారులపై విచారణ జరిపించాలని అభ్యర్థిస్తూ... జనవరి 1న రాష్ట్రపతికి సమాచార హక్కు చట్టం కింద లేఖ రాశాడు.