ఆదిలాబాద్ జిల్లాలోని యాపల్గూడ గ్రామానికి చెందిన కత్తి అక్కమ్మకు రోడ్డు పక్కనే ఐదెకరాల పొలం ఉంది. కుమారుడు అశోక్తో కలిసి ఆ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రహదారి విస్తరణలో భాగంగా అక్కమ్మ పొలంలోంచి రోడ్డు వేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... పోలీసులకు పట్టిస్తామంటూ గుత్తేదార్లు భయపెడ్తున్నారు. బాధిత రైతులు పనులను అడ్డుకుంటే... అర్ధరాత్రుల్లో పనులు చేస్తున్నారని చెబుతున్నారు. సాయం చేయండంటూ అధికారుల వద్దకు వెళ్తే... మాట కూడా మాట్లాడకుండా ఇబ్బందులు పెడ్డుతున్నారు.
నయాపైసా పరిహారమైనా చెల్లించలే...
ప్రభుత్వం రూ.85 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన ఆదిలాబాద్-గాదిగూడ రహదారి విస్తరణ పనులను సీ-5 గుత్తేదారు సంస్థ చేజిక్కించుకుంది. అందులో భాగంగానే యాపల్గూడ సమీపంలో ఉన్న అక్కమ్మ పొలంలో దౌర్జన్యంగా పనులు చేస్తోంది. కనీసం బాధిత కుటుంబానికి చెప్పను కూడా చెప్పలేదు. ఉన్నఫలంగా భూమిలోంచి రోడ్డు వేస్తూ... నయాపైసా పరిహారమైనా చెల్లించలేదు. ఏం చేయాలో పాలుపోని బాధితులు అధికారుల చుట్టూ తిరుగుతూ... అవస్థలు పడుతున్నారు. తమ జీవనాధారమైన భూమిని లాక్కోవడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరి భూమిని వారే కాపాడుకోవాలి
ఆదిలాబాద్- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలను అనుసంధానం చేసే ఈ మార్గం విస్తరణపై ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్ల పనుల్లో ప్రగతి కనిపించడంలేదు. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు గడువు పెంచినా... పెద్దగా మార్పులేదు. కానీ గుత్తేదార్లు మాత్రం పేదరైతుల పొలాలను కబ్జా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే... ఎవరి భూమిని వారే కాపాడుకోవాలన్నట్లుగా అధికారులు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోందని తెలిపారు.
పనులు నిర్వహిస్తున్న గుత్తేదారుకు కొంతమంది అధికారుల మద్దతు ఉండటం వల్లే పేదరైతుల బతుకు చిద్రమవుతోంది.
ఇవీ చూడండి: 28 కార్పొరేషన్లను లాభదాయక పదవుల నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ