కరోనా భయంతో యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి వైదొలగినట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్లేయర్, ప్రపంచ నం.1 ర్యాంకర్ యాష్ బార్టీ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రయాణానికి అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. న్యూయార్క్ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 తేదీల మధ్య ఈ టోర్నీ జరగనుంది.
"ఈ ఏడాది వెస్ట్రన్, సదరన్ ఓపెన్లతోపాటు యూఎస్ ఓపెన్ వెళ్లట్లేదు. టోర్నీలో ఆడటం ఇష్టమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పాల్గొనడం లేదు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో నా బృందాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు"
-యాష్ బార్టీ, ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి
ఆస్ట్రేలియాలో కరోనావ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడం వల్ల ఈ సమయంలో ప్రయాణం కష్టతరం అవుతుంది. ఒకవేళ టోర్నీలో పాల్గొనాలనుకుంటే ప్రభుత్వం నుంచి బార్టీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణికులు రెండు వారాల నిర్భంధాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందుకే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.