భారత దేశ డోపింగ్ ప్రయోగశాలపై మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(వాడా). నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ(ఎన్డీటీఎల్) అధికారిక గుర్తింపును మరో ఆర్నెళ్లు రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 17 నుంచి ఈ వేటు అమల్లోకి వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇప్పటికే ఆర్నెళ్లుగా వేటు ఎదుర్కొంటోంది ఎన్డీటీఎల్. ఒలింపిక్స్కి మరో ఏడాదే గడువు ఉన్న సమయంలో వాడా తీసుకున్న నిర్ణయం కలవరపెడుతోంది. దేశీయంగా డోపింగ్ నిరోధం పట్ల తీసుకుంటున్న చర్యలకు ఇది పెద్ద సమస్యగా మారనుంది.
అంతర్జాతీయ ప్రమాణాలను ఎన్డీటీఎల్ అందుకోవట్లేదని పేర్కొంటూ గతంలోనే గుర్తింపు రద్దుకు సూచించింది వాడా. ఆ తర్వాత నిర్వహించిన తనిఖీల్లోనూ లోపాలు కనిపించినట్లు అధికారులు నివేదించారు. అయితే ఇప్పటికీ లోపాలు సరిదిద్దలేదనే కారణంతో మరోసారి వేటు వేసింది. అయితే వాడా నిషేధాన్ని సవాల్ చేస్తూ ఎన్డీటీఎల్ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్(సీఏఎస్)ను ఆశ్రయించే వెసులుబాటు ఉంది.
ఇలా చేస్తే వేటు తొలగిపోవచ్చు...!
ప్రయోగశాలల్లో వివిధ దశల్లో ఉన్న నమూనాలను.. గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్లకు పంపాల్సి ఉంటుంది. వాడా సూచనల ఆధారంగా ఎన్డీటీఎల్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చి దిద్దితే.. నిషేధ కాలం పూర్తయ్యేలోగా మళ్లీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తాజా నిర్ణయంతో డోప్ పరీక్షలు నిర్వహించుకునేందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా)కు ఎలాంటి ఆటంకం ఉండదని అధికారులు భావిస్తున్నారు. కానీ సేకరించిన నమూనాలకు ఇతర దేశాల్లో గుర్తింపు పొందిన ల్యాబ్ల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.