భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ అంత్యక్రియలు చండీగఢ్లోని మట్కా చౌక్ శ్మశాన వాటికలో జరిగాయి. ఆయన అంతిమయాత్రలో కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు, పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ వీపీ సింగ్ బద్నోర్, హరియాణా క్రీడా మంత్రి సందీప్ సింగ్ పాల్గొన్నారు.
గత రెండు నెలలుగా కొవిడ్తో బాధపడుతున్న మిల్కా సింగ్ ఇటీవల మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న రాత్రి ఒక్కసారిగా తీవ్ర జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. దీంతో గత రాత్రి 11.30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా బాధపడుతూ ఆయన భార్య నిర్మలా కౌర్ గత ఆదివారం కన్నుమూశారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీకి మిల్కా సింగ్ పేరు..
పాటియాలాలోని క్రీడా విశ్వవిద్యాలయానికి దివంగత స్ప్రింటర్ మిల్కా సింగ్ పెట్టనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెల్లడించారు. అంతకుముందు సీఎం.. రాష్ట్ర క్రీడా మంత్రి రానా గుర్మిత్ సింగ్ సోధీతో కలిసి మిల్కా సింగ్కు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
ఘనతలు..
- 1929 నవంబరు 20న పంజాబ్లోని గోవిందపురా(ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)లో జన్మించారు మిల్కా సింగ్. టీనేజీలో పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన మిల్కా.. శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు. అనంతరం భారత సైనిక దళంలో చేరి.. ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్లో తానేంటో నిరూపించుకున్నారు.
- 1958 ఆసియా క్రీడల్లో పాల్గొని 200 మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందే 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు నమోదు చేసిన ఆయన.. 1956 విశ్వక్రీడలకు అర్హత సాధించారు. అయితే ఈ పోటీల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం 1958లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గి ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేశారు.
- 1960 రోమ్ ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్నారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తాచాటారు. 400మీటర్లు, 4X400 మీటర్ల రిలేలో పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడల్లో మిల్కా సింగ్ కృషికిగాను 1959లో భారత ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
- 400 మీటర్ల రేసులో మిల్కా సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అప్పటివరకున్న 45.9 సెకన్ల రికార్డు బ్రేక్ చేస్తూ, కొత్త టైమింగ్ను(45.8 )నెలకొల్పారు. జాతీయ స్థాయిలో ఈ రికార్డును 2006 వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం.
- మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలైందీ సినిమా. ఇందులో ఫర్హాన్ అక్తర్.. మిల్కా పాత్ర పోషించారు. ఇందులోని పాత్రకుగాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడిగా నిలిచాడు ఫర్హాన్. పలు అవార్డులనూ అందుకుందీ చిత్రం.
ఇదీ చదవండి: కరోనాతో మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్ మృతి