క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా పురస్కారాలు అందుకోబోతున్న క్రీడాకారుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్గా తేలింది. అందులో ఇద్దరు.. రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (ఖేల్రత్న), తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ (అర్జున)గా వెల్లడైంది. మరొకరి వివరాలు తెలియలేదు. సాత్విక్ సంగతి గురువారమే వెల్లడి కాగా.. వినేశ్కు కరోనా ఉన్నట్లు శుక్రవారం ఆమే స్వయంగా వెల్లడించింది.
హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది దిల్లీలో జరిగే ఈ కార్యక్రమాన్ని తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 74 మంది అవార్డీలకు (5 ఖేల్రత్న, 27 అర్జున సహా) వైద్య పరీక్షలు చేయగా.. ముగ్గురికి ఈ మహమ్మారి సోకినట్లు సాయ్ తెలిపింది. వీరే కాక అనారోగ్యంతో ఉన్న మరో ఆరుగురు కూడా శనివారం జరిగే అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావట్లేదు. దీంతో 60 మంది ఈ వేడుకలో అవార్డులు అందుకోనున్నారు.
ఈ పురస్కారాలను అందుకోవడానికి అవార్డీలు తమకు కేటాయించిన సాయ్ కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అవార్డులను, సర్టిఫికెట్లను, బ్లేజర్లను ఆయా కేంద్రాలకు పంపించామని.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తమ పేర్లను చదవగానే వాళ్లు ట్రోఫీ, సర్టిఫికెట్లను అందుకోవాలని సాయ్ పేర్కొంది. దిల్లీ, ముంబయి, కోల్కతా, చండీగఢ్, బెంగళూరు, పుణె, సోనెపట్, హైదరాబాద్, భోపాల్ సాయ్ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈసారి రికార్డు స్థాయిలో అయిదుగురికి ఖేల్రత్న అవార్డులు ప్రకటించారు. రోహిత్శర్మ (క్రికెట్), వినేశ్ ఫొగాట్ (రెజ్లింగ్), రాణి రాంపాల్ (హాకీ), మరియప్పన్ తంగవేలు (పారా అథ్లెటిక్స్), మనిక బాత్రా (టీటీ)లకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. రాణి, తంగవేలు (బెంగళూరు), మనిక (పుణె) భిన్న వేదికల నుంచి అవార్డులను స్వీకరించనున్నారు. ఐపీఎల్ ఆడటానికి దుబాయ్ వెళ్లిన స్టార్ క్రికెటర్లు రోహిత్శర్మ (ఖేల్రత్న), ఇషాంత్శర్మ (అర్జున) తిరిగొచ్చాక తమ పురస్కారాలను అందుకోనున్నారు.