ఐపీఎల్ రెండో దశ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ సర్వసభ్య సమావేశం(ఎస్జీఎం) శనివారం జరిగింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్లో మిగిలిన లీగ్ మ్యాచ్లను జరపాలని నిశ్చయించారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. త్వరలోనే షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపారు.
"గతేడాది లాగానే దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే విషయమై ఆయా దేశాల క్రికెట్ బోర్డులతో బీసీసీఐ చర్చించనుంది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందుబాటులో ఉండనున్నారు. కానీ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్ల విషయమై స్పష్టత లేదు. 25 రోజుల పాటు ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం"-బీసీసీఐ అధికారి.
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ను ఇక్కడ నిర్వహించే విషయమై మరోసారి చర్చలు జరిపాల్సిన అవసరముందని నిర్వాహకులు తెలిపారు. జూన్ చివర్లో లేదా జులై తొలి వారంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
దుబాయ్కి గంగూలీ, జై షా..
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో సోమవారం జరిగే బోర్డు సమావేశంలో.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొననున్నారు. ఇందులో భారత్ వేదికగా అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ గురించి చర్చించనున్నారు.