ఐపీఎల్ 13వ సీజన్ ఇటీవల దిగ్విజయంగా ముగిసింది. అంతలోనే ఆయా ఫ్రాంఛైజీల దృష్టంతా 2021 సీజన్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 14వ సీజన్లో భారీ మార్పులు కనిపించబోయే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగా తుది జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ క్రీడాకారులను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ ఆయా ఫ్రాంఛైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరుతున్నాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ ఇప్పటిదాకా దృష్టి సారించలేదు. కానీ మరోసారి జట్ల యాజమాన్యాల నుంచి ఒత్తిడి వస్తే.. బోర్డు తన నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ ఉన్నతాధికారి వెల్లడించారు.
బీసీసీఐ ఒప్పుకొంటుందా?
విదేశీ ఆటగాళ్ల సంఖ్య పెంచేందుకు బీసీసీఐ ఒప్పుకొంటుందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్.. ప్రారంభం కావడానికి అసలు కారణం భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువ స్వదేశీ క్రికెటర్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలనే! ఈ ఆలోచన వల్లే బుమ్రా, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య వంటి కొంతమంది ఆటగాళ్లు లీగ్లో సత్తా చాటి టీమ్ఇండియాలో చోటు కూడా దక్కించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో తాజా నిబంధనను సడలిస్తే.. ఐపీఎల్ ప్రాథమిక లక్ష్యం కనుమరుగవుతుంది. ప్రతిభ ఉన్న యువ స్వదేశీ క్రికెటర్లకు వేదిక కావాల్సిన ఈ లీగ్... కేవలం కాసులు కురిపించే ఆటగానే మిగిలిపోతుందనేది కొందరు విశ్లేషకుల వాదన.
తొమ్మిది లేదా పది
వచ్చే ఐపీఎల్లో ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు అదనంగా మరో ఒకటి లేదా రెండు జట్లను చేర్చబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే మెగా వేలం జరిగే అవకాశాలున్నాయి. జట్లు తమ బృందాన్ని మరింత పటిష్టపర్చుకునే దిశగా ఈ వేలం ఉపయోగపడుతుంది.
ఇదీ చూడండి : ఐపీఎల్ నిర్వహణకు ఖర్చెంతో తెలుసా?