పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ సమకాలీన క్రికెట్ వ్యవహారాలు, ఆటగాళ్లపై అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటాడు. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రదర్శనలను కూడా ఎండగడుతుంటాడు. ఆటగాళ్ల నైపుణ్యాలను, వారి తప్పులను తెలియజేస్తాడు. అలాగే ఇతర దేశాల క్రికెటర్లు ఎవరైనా మంచి ప్రదర్శన చేసినా వారిని మెచ్చుకుంటాడు. ఈ క్రమంలోనే పలుమార్లు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం ప్రశంసించాడు. తనకు నచ్చితే ఎవరైనా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాడు. దాంతోనే కల్మశం లేకుండా తన అభిప్రాయాలు, విశ్లేషణలను అభిమానులతో పంచుకుంటాడు. అక్తర్.. టీమ్ఇండియా ఆటగాళ్లను పొగడడంపై పాకిస్థాన్లో కొందరు అభిమానులకు నచ్చదు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. ఇదే విషయాన్ని ఓ పాకిస్థాన్ క్రికెట్ ఛానల్ అతడిని ప్రశ్నించగా, దానికి అక్తర్ కూడా అంతే దీటుగా సమాధానమిచ్చాడు.
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని, అతడి రికార్డులే ఆ విషయాన్ని చెబుతాయని మాజీ పేసర్ అన్నాడు. పాక్ క్రికెట్లో లేదా ప్రపంచ క్రికెట్లో అతడిలా ఆడే బ్యాట్స్మన్ ఎవరున్నారని ప్రశ్నించాడు. టీమ్ఇండియా సారథి ప్రశంసలకు అర్హుడని చెప్పాడు. అలాంటప్పుడు తాను కోహ్లీని లేదా రోహిత్ శర్మను పొగిడితే తప్పేంటని నిలదీశాడు. ఈ విషయంలో పాక్ అభిమానులు ఎందుకు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలియదన్నాడు. వాళ్లంతా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలన్నాడు. తనని విమర్శించే ముందు కోహ్లీ గణంకాలను చూడాలని హితవు పలికాడు.
'అతడు కేవలం భారతీయుడు అయినందుకే ద్వేషించాలా? మనం వాళ్లను పొగడకూడదా?' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అతి తక్కువ కాలంలోనే 70 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడని, అతడిలా ఎవరు సాధించారని అడిగాడు. ప్రస్తుతం టీమ్ఇండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ అద్భుతంగా రాణిస్తున్నారని, వాళ్లను ద్వేషించడం విడ్దూరంగా ఉందని అక్తర్ పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తానెందుకు మెచ్చుకోకూడదని తిరిగి ప్రశ్నించాడు.