టీమిండియా సారథి విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నాడు. అయితే ఈ నెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది భారత్. ఈ మ్యాచ్ల్లో అయినా రాణించాలని విరాట్ అభిమానులు ఆశిస్తున్నారు.
వచ్చే సిరీస్లో కోహ్లీ 133 పరుగులు చేస్తే.. వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. అదే జరిగితే వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ రికార్డు బ్రేక్ అవుతుంది. సచిన్ 300 ఇన్నింగ్స్లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ ఇప్పటి వరకు 239 ఇన్నింగ్స్లే ఆడాడు.
![Indian Skipper Virat Kohli Set To cross Sachin Tendulkar In Becoming Fastest To Score 12,000 ODI Runs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6363976_kohli2020.jpg)
ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ (314 ఇన్నింగ్స్లు), శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర (336 ఇన్నింగ్స్లు), శ్రీలంక మాజీ సారథి సనత్ జయసూర్య 379 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు.
అయితే విరాట్ ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో నిరాశపరిచాడు. మొత్తం 11 ఇన్నింగ్స్ల్లో కేవలం 218 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక్క అర్ధ సెంచరీ ఉంది. ఒక పర్యటనలో కోహ్లీ చేసిన అతి తక్కువ పరుగులు ఇవే. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఈ నెల 12న ధర్మశాలలో తొలి వన్డే, 15న లక్నోలో రెండో వన్డే, 18న కోల్కతాలో ఫైనల్ వన్డే జరగనుంది.