టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ బుధవారం కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నాడు. రాంచీలోని స్థానిక గురునానక్ ఆస్పత్రి వర్గాలు అతడి నుంచి నమూనాలు సేకరించాయి. వాటి ఫలితాలు గురువారం వెల్లడించగా.. అందులో కరోనా నెగిటివ్ వచ్చింది. ఫలితంగా ధోనీ చెన్నైలోని శిక్షణా శిబిరానికి ఆగస్టు 14న పయనం కానున్నాడు.
ఆగస్టు 15 నుంచి 20 మధ్య సీఎస్కే ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఫిట్నెస్ క్యాంపు జరగనుంది. అక్కడి నుంచే ఈ నెల 21న ఐపీఎల్ ఆడేందుకు యూఏఈకి వెళ్లనున్నారు. అయితే, ఐపీఎల్ ఆటగాళ్లు ఎవరైనా అక్కడికి వెళ్లే ముందు రెండు సార్లు కరోనా పరీక్షలు చేసుకోవాలి. అలాగే అక్కడికి వెళ్లాక కూడా పలుమార్లు టెస్టులు చేయనున్నారు.