దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ఐసీసీ)కి ఓ లేఖ రాసింది. ప్రణాళిక ప్రకారం సిరీస్లు జరగనప్పుడు.. తక్కువ సంపన్న క్రికెట్ బోర్డుల ఆర్థిక నష్టాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. కరోనా నేపథ్యంలో ఇటీవల సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా గురించి ఇందులో ప్రస్తావించింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్ను ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా విముఖత చూపింది.
"ఈ పర్యటనను రద్దు చేసుకున్న ఆసీస్.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది" అని లేఖలో దక్షిణాఫ్రికా పేర్కొంది. ఆసీస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అల్పాదాయ క్రికెట్ బోర్డులపై చాలా ప్రభావం పడిందని సౌతాఫ్రికా బోర్డు తెలిపింది.
దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో పేర్కొంది. కానీ మ్యాచ్ ప్రణాళికల విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిందిగా లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని కోరిందని వెల్లడించింది.
ఈ విషయంపై గతంలో క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్ హక్లీ చేసిన వ్యాఖ్యలను ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో ఉటంకించింది. "దక్షిణాఫ్రికాలో పరిస్థితులు బాగోలేవు. ఈ పర్యటన కోసం మేము చేయాల్సిందంతా చేశాం కానీ అధిక మంది వైద్యుల సూచన మేరకు ఈ సిరీస్ను వాయిదా వేయాల్సి వచ్చింది" అని హక్లీ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా నిర్ణయం వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లోకి న్యూజిలాండ్ అధికారికంగా వెళ్లింది. తదుపరి స్థానం కోసం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య పోటీ నెలకొంది.
ఇదీ చదవండి: 'కెప్టెన్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం'