న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 0-2 తేడాతో టీమిండియా ఘోర పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పలు విమర్శలు గుప్పుమన్నాయి. తాజాగా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు మాజీ టీమిండియా సెలక్టర్ సందీప్ పాటిల్. ఈ సిరీస్లో రహానె నాలుగు ఇన్నింగ్స్లో కేవలం 91 పరుగులే చేశాడు.
రహానె పేలవమైన బ్యాటింగ్ చేశాడని అన్నాడు పాటిల్. తనని తాను టెస్టు స్పెషలిస్టుగా నిరూపించుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. ఎక్కడ ఔట్ అవుతానో అనే భయంతో కనీసం పరుగులు కూడా సరిగ్గా తీయకుండా క్రీజులోపలే ఉండి తడబడుతూ ఆడాడని తెలిపాడు. బ్యాట్స్మెన్ క్రీజుకే అతుక్కుపోతే పరుగులు ఎవరు సాధిస్తారని ప్రశ్నించాడు. బ్యాట్స్మెన్ క్రీజులో ఉండి ఆడాలనుకుంటే అతడిని సెక్యూరిటీ గార్డ్గా పిలవాలని అన్నాడు.
"గతంలో రహానె ముంబయి తరపున ఆడేటప్పుడు అతడి బ్యాటింగ్ పేలవంగా ఉందని విన్నాను. అతడి భయమే అతడి ఓటమికి కారణమవుతోంది. రహానేకు విదేశాల్లో మంచి రికార్డుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు అతడు పరిమిత ఓవర్లలో రాణించలేకపోతున్నాడు. అందుకని కనీసం టెస్టుల్లోనైనా రాణించాలని ప్రయత్నిస్తున్నాడు."
-సందీప్ పాటిల్, మాజీ క్రికెటర్.
టీమిండియా కోచ్పై విమర్శలు
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్నూ విమర్శించాడు పాటిల్. రహానెను ఆటను మెరుగుపరుచుకునేలా వారు ప్రేరేపించాలని సూచించాడు.
ఇదీ చూడండి : రిక్షా ఎక్కేందుకైనా డబ్బులు ఉండేవి కావు : రహానె