గతంలో జరిగిన ఒలింపిక్స్కు.. టోక్యో విశ్వ క్రీడలు పూర్తిగా భిన్నమని భారత జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) అభిప్రాయపడ్డాడు. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో ఆశ్చర్యకర ఫలితాలు.. సంచలనాలు ఖాయమని తెలిపాడు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు మూడు విభాగాల్లో పతకం సాధించే అవకాశం ఉందని చెప్పాడు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఆతిథ్యమివ్వనున్న ఒలింపిక్స్ కోసం భారత జట్టు పూర్తి సన్నద్ధంగా ఉందంటున్న గోపీచంద్ ఇంటర్వ్యూ ‘ఈనాడు’కు ప్రత్యేకం.
ఒలింపిక్స్కు భారత షట్లర్ల సన్నద్ధత ఎలా ఉంది?
విశ్వ క్రీడలకు భారత జట్టు పక్కాగా సిద్ధమవుతోంది. సింగిల్స్లో సింధు(PV Sindhu), సాయిప్రణీత్.. పురుషుల డబుల్స్లో సాత్విక్- చిరాగ్ కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. భారత ప్రభుత్వం, సాయ్(SAI)ల మద్దతుతో క్రీడాకారులంతా వ్యక్తిగత సహాయ సిబ్బంది ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఫిట్నెస్, ఆట పరంగా అందరూ మంచి స్థితిలో ఉన్నారు.
బ్యాడ్మింటన్లో ఈసారి మన పతకావకాశాలు ఎలా ఉన్నాయి?
మహిళల సింగిల్స్లో సింధు పతకం సాధించడం ఖాయం. డబుల్స్లో సాత్విక్- చిరాగ్ల జోడీ పతకం గెలవొచ్చు. సాయిప్రణీత్కూ మంచి అవకాశం ఉంది. పురుషుల సింగిల్స్లో గట్టి పోటీ ఖాయం. పతకం సాధించడానికి చాలా కష్టపడాలి. అక్సెల్సెన్, ఆంటోన్సెన్, మొమొట లాంటి ఆటగాళ్ల పోటీని ఎదుర్కోవడం అంత సులువేమీ కాదు. అయితే ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం సాధించిన సాయిప్రణీత్ పక్కాగా సన్నద్ధమయ్యాడు. సాత్విక్-చిరాగ్ అంతర్జాతీయ స్థాయిలో బాగా ఆడుతున్నారు. నంబర్వన్ జోడీ కెవిన్- మార్కస్ (ఇండోనేసియా)లపై తప్ప అందరిపైనా సాత్విక్-చిరాగ్ విజయాలు సాధించారు. రెండేళ్లలో చాలా పరిణతి సాధించారు. సన్నద్ధత బాగుంది. స్థాయికి తగ్గట్లు ఆడితే కచ్చితంగా పతకం సాధించొచ్చు.
ఒలింపిక్స్కు నెల రోజుల సమయం కూడా లేదు. కానీ ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించకపోవడం భిన్నంగా అనిపిస్తోందా?
ఈ విశ్వ క్రీడలు భిన్నం. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ప్రతి రోజూ కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత చూసుకోవాలి. ముఖానికి ముసుగు ధరించాలి. గతంలో భోజన శాలలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఉండేవాళ్లు. ఇష్టమైన ఆహారం తీసుకుంటూ సరదాగానే కనిపించేవాళ్లు. ఇప్పుడలా కాదు. ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చోవాలి. ఎవరినీ కలవకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పదివేలకు పైగా అథ్లెట్లు పాల్గొనే ఒలింపిక్స్లో కరోనా ప్రభావం కనిపిస్తే క్రీడల పరిస్థితేంటి?
ఒలింపిక్స్ను నిర్వహించకూడదని భావిస్తే ఇప్పటికే వాయిదా పడేవి. జపాన్లో 70- 80 శాతం మంది ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణను వ్యతిరేకించినట్లు కథనాలు కూడా వచ్చాయి. నెల రోజుల కిందట భారత్, జపాన్ల్లో పరిస్థితి ఆందోళనకరంగా కనిపించింది. అప్పుడే వెనక్కి తగ్గలేదంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒలింపిక్స్ జరుగుతాయనే లెక్క. కచ్చితంగా ఒలింపిక్స్ నిర్వహించాలన్న పట్టుదలతో జపాన్ ఉంది.
ఈ ప్రత్యేక పరిస్థితుల్లో భారత క్రీడాకారులు ఎక్కువ పతకాలు గెలుస్తారా?
ఇప్పుడే చెప్పలేం. చాలామంది 2016 రియో ఒలింపిక్స్ సమయంలోని ప్రదర్శన గురించి ఆలోచిస్తున్నారు. కానీ రష్యా, చైనా వంటి దేశాల్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. ఎవరెలా సన్నద్ధమవుతున్నారో సమాచారం లేదు. బ్యాడ్మింటన్ వరకే చూసుకుంటే ఏడాదిన్నరగా చైనా క్రీడాకారుల ఊసే లేదు. షూటింగ్తో సహా చాలా క్రీడల్లో అగ్రశ్రేణి దేశాల ప్రాతినిధ్యం కనిపించట్లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఒలింపిక్స్ ఆశ్చర్యకర ఫలితాలకు వేదికగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఊహించని ప్రదర్శనలు చూడొచ్చు. సంచలనాలు నమోదు కావొచ్చు. మానసికంగా బలంగా ఉన్న క్రీడాకారులే విజేతలుగా నిలుస్తారు.
ఒలింపిక్స్లో భారత క్రీడాకారులపై ప్రత్యేక ఆంక్షలపై మీ అభిప్రాయం?
నిబంధనలపై ఇంకా స్పష్టత రాలేదు. మొదట ఐదు రోజులు ఐసొలేషన్ అన్నారు. మెగా టోర్నీకి ముందు ఐదు రోజులు ఫిట్నెస్, ప్రాక్టీస్కు దూరంగా ఉండటం కష్టం. ఇప్పుడు 2 రోజులు క్వారంటైన్.. మూడు రోజులు ఎవరినీ కలవకుండా తిరగొచ్చు అంటున్నారు. దీనికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. భారత్ నుంచి జపాన్కు 3, 4 గంటల ప్రయాణమే కాబట్టి ఇక్కడి వాళ్లకు ఇబ్బంది ఉండదు. కానీ మీరాబాయి ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా వెళ్లింది. 7, 8 గంటల తేడా ఉంటుంది. భారత షూటర్లు క్రొయేషియాలో ఉన్నారు. వాళ్లకు 9 గంటలు తేడా. ప్రయాణ బడలిక, క్వారంటైన్, సాధనల మధ్య సమన్వయం కాస్త కష్టమే.