మలేసియా ఓపెన్ వాయిదా, సింగపూర్ ఓపెన్ రద్దు వల్ల ఒలింపిక్స్ అర్హత సాధించాలనుకున్న కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయి. అయితే తనకు మాత్రం ఈ మెగాక్రీడల అర్హతపై ఆశలు పోలేదని శ్రీకాంత్ అన్నాడు. తాను అర్హత సాధిస్తాననే నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు.
ఒలింపిక్స్ అర్హత పోటీల నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్ బుధవారం ప్రకటించింది. దీని గురించి మాట్లాడిన శ్రీకాంత్.. "ఈ క్వాలిఫయర్స్లో నేను ఆడితే అర్హత సాధిస్తాను. కానీ ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు. బీడబ్ల్యూఎఫ్, ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ఏమైనా అవకాశం కల్పించేలా చేస్తుందని భావిస్తున్నాను. నిజానికి బీడబ్ల్యూఎఫ్ ఏదో చేస్తుందని కాదు కానీ, నేను అర్హత సాధిస్తాననే సానుకూల దృక్ఫథంతో ఉన్నాను. ఆగస్టు వరకు ఏ టోర్నీ లేకపోవడం, తెలంగాణాలో లాక్డౌన్ వల్ల ప్రస్తుతానికి విరామం తీసుకున్నాను. శిక్షణ తీసుకోవడానికి అనుమతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అనుమతి దొరికితే వచ్చే వారం నుంచి ట్రైనింగ్ మొదలుపెడతాను" అని అన్నాడు.
టోక్యో ఒలింపిక్స్ సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్.. డబుల్స్లో చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ అర్హత సాధించారు. వీరందరూ ఈ ఓపెన్స్ రద్దు అవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణీత్, చిరాగ్-సాత్విక్.. వచ్చే వారం నుంచి ఒలింపిక్స్ కోసం శిక్షణ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఓపెన్ ఈవెంట్స్ రద్దు అవ్వడం నష్టమే అయినప్పటికీ కొంచెం లాభం కూడా ఉందని అన్నారు పీవీ సింధు తండ్రి పీవీ రమణ, ప్రణీత్.
ఇదీ చూడండి: సింగపూర్ ఓపెన్ రద్దు.. సైనా, శ్రీకాంత్ ఆశలు గల్లంతు!