కొంత కాలంగా తెలుగులో పీరియాడిక్ కథల సందడి మెండుగా కనిపిస్తోంది. వర్తమానంలో సాగే కథలు కాకుండా, వెనుకటి రోజులకి వెళ్లి అప్పటి గాథల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు. దాంతో ఆ సినిమాలు ప్రత్యేకతని సంతరించుకుంటున్నాయి. అవి ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతున్నాయి. ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేయడానికి అలాంటి నేపథ్యంతో కూడిన చిత్రాలు ముస్తాబవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఆర్ఆర్ఆర్
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా అగ్రదర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్నదే. 1920 కాలాల్ని ఆవిష్కరించే చిత్రమిది. రాజమౌళి చిత్రం అంటే నేపథ్యమే కాదు, వాటిలోని భావోద్వేగాలూ ప్రత్యేకమే. కథానాయకుల్ని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్లుగా చూపిస్తుండడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ మూవీ అక్టోబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది.
రాధేశ్యామ్
ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథ 1970 కాలాన్ని ఆవిష్కరించబోతోంది. ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' ఆనాటి అందాలను ఆవిష్కరిస్తూ, యూరప్ నేపథ్యంలో తెరకెక్కుతుండటం విశేషం. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంటెన్స్ లవ్స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకురానుంది.
పవన్-క్రిష్ చిత్రం
పవర్స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతంది. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో రాబిన్ హుడ్ తరహా దొంగ పాత్రలో కనువిందు చేయనున్నారు పవన్. ఈ మూవీ కోసం 17వ శతాబ్దం నాటి చార్మినార్ సెట్ను రూపొందించారు. అక్కడే యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.
పుష్ప
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కుతోంది. అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్లు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. రెట్రో, మాస్ లుక్లో బన్నీ వారెవ్వా అనిపించారు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నారప్ప
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'నారప్ప' 1980కి ముందు జరిగే కథే. ఇదొక కొత్త రకమైన నేపథ్యాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 14న థియేటర్లలోకి వస్తోందీ మూవీ.
విరాట పర్వం
దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'విరాటపర్వం'. 1990ల్లో సాగే కథ ఇది. ఇందులో కామ్రేడ్ రవన్నగా రానా కనిపించబోతున్నారు. ప్రియమణి, నందితా దాస్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శ్యామ్ సింగరాయ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లు. ప్రస్తుతం కోల్క్తాలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోందీ మూవీ. తాజాగా విడుదల చేసిన ఫస్ట్లుక్ చూస్తుంటే ఈ చిత్రం కూడా పాతం కాలం నాటి కథతో తెరకెక్కుతోన్నట్లు స్పష్టమవుతోంది.