'మణికర్ణిక' సినిమాలో నటించినంత మాత్రాన కంగనా రనౌత్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ అయిపోతుందా..! అని అంటున్నాడు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత కంగన బాలీవుడ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అందరూ కలిసి సుశాంత్ చనిపోయేలా చేశారని ఘాటుగానే మాట్లాడింది. బాలీవుడ్తోపాటు ముంబయి పోలీసుల్ని, ప్రభుత్వాన్ని తప్పుబట్టింది.
కంగన వ్యాఖ్యల్ని శివసేన తీవ్రంగా పరిగణించింది. ఇది కాస్తా పెద్ద చర్చకు దారి తీసింది. శివసేన నాయకులు కంగన ఇక ముంబయి రావొద్దని, సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోనే ఉండమని వ్యాఖ్యానించారు. వీరిని ఎదిరించి మాట్లాడిన కంగన.. 'వై ప్లస్' సెక్యూరిటీతో సెప్టెంబరు 9న ముంబయిలో అడుగుపెట్టింది. చట్టవిరుద్ధంగా కట్టిన భవనం అంటూ ఆమె కార్యాలయ కూల్చివేతకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంది.
ఇలా కంగన చుట్టూ వివాదాలు, సమస్యలు ఉండటాన్ని ఉద్దేశిస్తూ ప్రకాశ్రాజ్ సెటైర్ వేశాడు. "ఒక్క సినిమాతోనే కంగనా రనౌత్ 'రాణి లక్ష్మీబాయ్' అయితే.. దీపికా పదుకొణె 'పద్మావతి' అవ్వాలి.. హృతిక్ రోషన్ 'అక్బర్', షారుక్ ఖాన్ 'అశోక', అజయ్ దేవగణ్ 'భగత్ సింగ్', ఆమిర్ ఖాన్ 'మంగళ్ పాండే', వివేక్ ఒబెరాయ్ 'మోదీ జీ'గా మారాలి.. మరి వాళ్లేం కావాలి" అనే అర్థంతో ఓ పోస్ట్ చేశాడు. కంగన తీరును పరోక్షంగా ఆయన విమర్శించాడు. ఆయన పోస్ట్ ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.