తుంగభద్ర పుష్కరాల చివరి రోజు విషాదం చోటుచేసుకుంది. 12 రోజుల పుష్కరాలు ప్రశాంతంగా ముగిశాయని అనుకుంటుండగా ఘోరం జరిగింది. అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో ఇద్దరు బాలికలు మృతి చెందారు.
గొందిమల్లకు చెందిన రవి, లీలావతి దంపతుల కుమార్తె దీక్షిత, హరణి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె మైథిలితో పాటు మరో ముగ్గురు బాలికలు నది వద్దకు వెళ్లారు. హరిణి దుస్తులు ఉతుకుతుండగా.. మరో నలుగురు పిల్లలు నదిలో స్నానం చేశారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఎక్కువగా లోతు ఉన్న గుంతలోకి వారు వెళ్లిపోయారు. అది గమనించిన హరిణి కేకలు వేయగా.. అదే గ్రామానికి చెందిన సుధాకర్ నాయుడు, క్యాతుర్కు చెందిన శివ వెంటనే స్పందించారు.
ఇద్దరు చిన్నారులను కాపాడగా.. మిగతా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తీసుకొచ్చే మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటంబ సభ్యులు తెలిపారు. హరిణి, రవి అన్నా చెల్లెలు కాగా.. వారి ఇద్దరు కుమార్తెలు దీక్షిత, మైథిలి మృతి చెందడంతో ఒకే కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి : ఎప్పటికప్పుడు వెబ్క్యాస్టింగ్ ద్వారా పరిశీలన: ఎస్ఈసీ