బోగస్ సంస్థల పేర్లతో నకిలీ ఇన్ వాయిస్లను సృష్టించిన ముగ్గురు నిందితులను రంగారెడ్డి సీజీఎస్టీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలతో మూడు బోగస్ సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు తీసుకున్నట్టు సీజీఎస్టీ కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. అనుమానంతో ఆ సంస్థలకు చెందిన ఇన్వాయిస్ బిల్లులను పరిశీలించగా.. బోగస్ సంస్థలుగా తేలినట్లు వివరించారు. రీఫండ్ కోసం దిల్లీ నుంచి రాహుల్ అగర్వాల్ వస్తున్నట్లుగా తెలుసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ మూడు సంస్థలు వ్యాపారం చేయకుండానే రూ. 32.54 కోట్లు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.19.1 కోట్లు రిఫండ్ తీసుకున్నట్లు వెల్లడించారు. బిహార్కు చెందిన ముఖేశ్ కుమార్, సంజయ్ జోషి, రాహుల్ అగర్వాల్ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను నాంపల్లి ఆర్థిక వ్యవరాల న్యాయస్థానంలో హాజరుపర్చగా.... 21 వరకు రిమాండ్ విధించినట్లు వివరించారు. బోగస్ సంస్థల పని పట్టేందుకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతున్నట్లు సీజీఎస్టీ కమిషనర్ తెలిపారు.