చిట్టీల పేరుతో మోసం చేసిన భార్యాభర్తల ఆస్తులను స్వాధీనం చేసుకొని.. తమకు న్యాయం చేయాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని జీడిమెట్ల, గాజులరామారం, పేట్ బషీరాబాద్, చింతల్, జగద్గిరిగుట్ట ప్రాంతాలకు చెందిన చిట్టీల బాధితులు.. బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగంతో కలిసి సమావేశం నిర్వహించారు. గత పదేళ్లుగా గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన దంపతులు నిర్మలారెడ్డి, సుదర్శన్ రెడ్డి వద్ద ప్రతి నెలా చిట్టీలు వేశామని బాధితులు తెలిపారు. కుమార్తెల పెళ్లిళ్ల కోసం చిట్టి ఎత్తుకుందామని వెళ్లే సరికి జెండా ఎత్తేసినట్లు పేర్కొన్నారు.
భలే కిలాడీలు
కేవలం నగరంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో వీరి వద్ద చిట్టీలు వేసి మోసపోయిన వారు ఉన్నారని బాధితులు గ్రహించారు. ఇలా రూ. 6 నుంచి 7 కోట్ల వరకు కొట్టేశారని తెలిపారు. తమ కష్టార్జితంతో పోగుచేసి కట్టిన డబ్బులను తమకు అందించేట్లు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మోసం చేసిన వారి ఆస్తులను జప్తు చేసి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
ఇదీ చదవండి: రూ.26కోట్ల విలువైన మున్సిపాలిటీ భూములు మాయం..