ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల్లో భాగంగా.. తీవ్ర నష్టాన్ని చవిచూసిన గాజా ప్రాంతానికి అగ్రరాజ్యం సాయం అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు. అయితే.. సాయం అందుకోవటంలో హమాస్ ఉండబోదని స్పష్టం చేశారు. హమాస్ను ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఉగ్రసంస్థగా పరిగణిస్తోంది. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధం చేసేందుకు పశ్చిమాసియా వెళ్లిన బ్లింకన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలు అదుపు చేసే ముందు.. అనేక సమస్యలను పరిష్కరించాలి. అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ మేరకు తొలుత గాజా ప్రాంతాన్ని పునర్నిర్మించాలి. ఇందుకోసం అమెరికా శాయశక్తులా కృషి చేస్తుంది. పశ్చిమాసియా దేశాలతో కలిసి అమెరికా పనిచేయనుంది. కానీ, ఈ సహాయక చర్యల్లో భాగంగా.. హమాస్కు ఎటువంటి సాయం చేసేందుకూ సిద్ధంగా లేము."
--ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి.
స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించే హక్కు ఇజ్రాయెల్ వాసులతో పాటు పాలస్తీనా ప్రజలకూ ఉందని బ్లింకెన్ అన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దీర్ఘకాలం కొనసాగేలా చూసేందుకు బ్లింకెన్.. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో సంప్రదింపులు జరిపారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల నాయకులతోనూ చర్చలు జరపనున్నారు.
బైడెన్ ఫోన్..
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసితో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పడంపై చర్చించారు. ఇరు ప్రాంతాల్లో ఘర్షణలు సద్దుమణిగించేందుకు ఈజిప్టు విశేష కృషి చేసిందని బైడెన్ అన్నారు.
ఇదీ చదవండి:ఒంటరి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు అధికం!