Turkey Suicide Bomber Attack : తుర్కియే రాజధాని అంకారాలోని హోంశాఖ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇదే తరహాలో దాడికి యత్నించిన మరో ముష్కరుడు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వేసవి సెలవుల అనంతరం ఆదివారం పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే కొద్ది గంటలకు ముందే ఈ దాడి జరిగిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించారు. తన కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఉగ్రదాడిపై దర్యాప్తు జరుగుతోందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి యిల్మాజ్ టుంక్ తెలిపారు. ఈ దాడులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తుర్కియే చేస్తున్న పోరాటానికి ఏ విధంగానూ ఆటంకం కలిగించలేవన్నారు. ఉగ్రవాదంపై తమ పోరాటం మరింత దృఢ సంకల్పంతో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.


ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తుర్కియే మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల తరచూ కుర్దిష్ తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ సంస్థ సభ్యులు తుర్కియేలో ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు. కాగా, తాజాగా జరిగిన ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు బాధ్యత వహించలేదు.


పండుగ రోజు ఆత్మాహుతి దాడి.. 55 మంది..
గతనెల 28న పాకిస్థాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 55 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రం మస్తుంగ్ జిల్లాలోని మదీనా మసీదు వద్ద మిలాద్-ఉన్-నబీ పర్వదినం రోజున ఈ పేలుడు జరిగింది. ఈ దాడిలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ నవాజ్ గాష్కోరి అనే పోలీసు అధికారి మృతి చెందారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పాక్ ఘటనలో 44 మంది దుర్మరణం!
ఈ ఏడాది జులైలో పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా ఇదే తరహా ఆత్మహుతి దాడి జరిగింది. కరడుగట్టిన ఇస్లామిస్ట్ పార్టీ నిర్వహించిన రాజకీయ సమావేశంలో జరిగిన ఈ ఘటనలో 44 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడిలో నిషేధిత సంస్థ డేష్ (ఐఎస్ఐఎస్) ప్రమేయం ఉన్నట్లు పోలీసు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
'రాజకీయ సభలో పేలుడు వెనుక ఐసిస్ హస్తం.. ముగ్గురు అరెస్ట్'
Suicide Blast In Pakistan : పండుగ నాడు పాక్లో ఆత్మాహుతి దాడి.. 55 మంది మృతి