కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. ప్రపంచమంతా కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో వ్యాక్సిన్లపై ప్రయోగాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెడికల్ జర్నల్ 'ద లాన్సెట్' ఎడిటర్ పెట్టిన ఓ ట్వీట్ తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే వ్యాక్సిన్ రేసులో ముందున్న ఆక్స్ఫర్డ్ టీకా అధ్యయన ఫలితాలను ప్రకటించబోతున్నట్లు ఆయన పోస్ట్ చేశారు. దీంతో వైద్యరంగంతోపాటు సామాన్యుల్లోనూ ఆ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
'రేపు.. వ్యాక్సిన్.. జస్ట్ సేయింగ్' అంటూ లాన్సెట్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హార్టన్ నిన్న ట్వీట్ పెట్టారు. దీంతో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కొవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్-I క్లినికల్ ట్రయల్స్ డేటాను నేడు ఆ జర్నల్ ప్రచురించనున్నట్లు తెలుస్తోంది. మానవ పరీక్షల తర్వాత ఈ టీకా కరోనా వైరస్కు వ్యతిరేకంగా డబుల్ ప్రొటెక్షన్ ఇవ్వగలదని ఆక్స్ఫర్డ్ పరిశోధకుల బృందం చెప్పినట్లు యూకే మీడియా గత గురువారం ప్రకటించింది.
ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకొంటున్న ఆస్ట్రాజెనెకా ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో భాగమైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. వచ్చే నెలలో భారత్లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఏడాది చివరినాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ సీఈఓ అడార్ పూనావాలా పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 వ్యాక్సిన్లు అభివృద్ధిలో ఉండగా.. వీటిలో రెండు డజన్లకు పైగా టీకాలు మనుషులపై క్లినికల్ ట్రయల్స్లో వివిధ దశల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి: వరద నీటి విడుదల కోసం డ్యామ్ బ్లాస్ట్