భారత్లో మలేరియా కేసులు, మరణాలు భారీగా తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ నివేదికలో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో 2000 సంవత్సరంలో 2 కోట్లుగా ఉన్న మలేరియా బాధితుల సంఖ్య 2019 నాటికి 56 లక్షలకు తగ్గినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
'ప్రపంచ మలేరియా నివేదిక 2020' పేరిట సోమవారం ఈ వివరాలను విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఓ. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల 9 లక్షల మంది మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. అయితే గత నాలుగేళ్ల నుంచి గణాంకాల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని వివరించింది.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం... 2018 ఏడాదితో పోల్చుకుంటే మలేరియా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. 2018లో 4 లక్షల 11 వేల మంది మలేరియా బారిన పడి మృతి చెందగా.. 2019నాటికి ఆ సంఖ్య 4 లక్షల 9 వేలకు తగ్గింది.
"ప్రత్యేకంగా ఆగ్నేయాసియా దేశాలు మలేరియా కట్టడిలో మెరుగైన అభివృద్ధి సాధించాయి. మలేరియా కేసుల్లో 73 శాతం, మరణాల్లో 74 శాతం తగ్గుదల నమోదైంది. ఇందులో భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది."
- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్
ఆగ్నేయాసియాలో ఇలా..
- ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తున్న మలేరియా మొత్తం కేసుల్లో 3 శాతం ఆగ్నేయాసియా దేశాల్లో నమోదవుతున్నాయి.
- 2000-2019 మధ్య కాలంలో మలేరియా కేసుల సంఖ్య 73 శాతం తగ్గింది.
- 2000 ఏడాదిలో 23 మిలియన్లుగా ఉన్న కేసుల సంఖ్య 2019 నాటికి 6.3 మిలియన్లకు తగ్గింది.
- 2000 ఏడాదిలో మలేరియాతో మరణించినవారి సంఖ్య 35 వేలుగా ఉంది. ఆ సంఖ్య 2019 నాటికి 9 వేలకు చేరింది.
భారత్లో ఇలా..
- భారత్లోనూ 2000-19 మధ్య కాలంలో మలేరియా బాధితుల సంఖ్య తగ్గగా... కేసుల్లో 18 శాతం, మరణాల్లో 20 తగ్గుదల నమోదైంది. 2000ల్లో 29,500 మంది మలేరియాతో మరణించగా.. ఆ సంఖ్య 2019 నాటికి 7,700కు తగ్గింది.
- అయితే గతేడాది.. ఆగ్నేయసియా ప్రాంతంలో భారత్లోనే 88 శాతం మలేరియా కేసులు నమోదవగా.. 86 శాతం మంది మరణిస్తున్నారు.
11 దేశాల్లోనే 70 శాతం కేసులు
ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లోనే 70శాతం మలేరియా కేసులు, 71శాతం మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. బూర్కినా ఫాసో, కాంగో, ఘనా, మాలి, భారత్, మొజాంబిక్, నైగర్, నైజీరియా, ఉగాండా, టాంజానియా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చూడండి: 'ఇళ్లపై పోస్టర్లతో అంటరానివారిగా కొవిడ్ రోగులు'