కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ ప్రశంసించారు.
మూసివేత సమయంలో సమాజంలో అట్టడుగు వర్గాల వారు కఠిన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని అభిప్రాయపడ్డారు టెడ్రోస్. కానీ పేద ప్రజలు ఇబ్బందుల పట్ల ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ మాత్రం ఆంక్షలతో సరిపెట్టకుండా పేద ప్రజల మేలు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని ట్విట్టర్లో ప్రశంసించారు.
"భారత్లోని కొవిడ్-19 కల్లోలం సందర్భంగా ప్రభావితమయ్యే ప్రజలకు మేలు కలిగే విధంగా 80 కోట్ల మంది నిస్సహాయ ప్రజలకు ఆహార సరఫరా, 20 కోట్ల 40 లక్షల పేద మహిళలకు ఆర్థిక సహాయం, 8 కోట్ల కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ వంటి అంశాలతో కూడిన 24 బిలియన్ డాలర్ల సహకారాన్ని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీకి నా ప్రశంసలు" అని ట్వీట్ చేశారు టెడ్రోస్. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ స్థాయిలో సమాజహిత కార్యక్రమాలు చేపట్టటం అందరికీ సాధ్యం కాదని ఆయన అన్నారు.
ఇదీ చూడండి:'సామాజిక దూరం కాదు భౌతిక దూరం పాటించాలి!'