పాకిస్థాన్లో దాడులకు భారత్ సహకరిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను బయటపెట్టారు. పాకిస్థాన్ ఆర్మీ అధికారి జనరల్ బాబర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై భారత్ శనివారం నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులకు భారత్ కారణం. భారత నిఘా వర్గాలకూ, ఇతర ఉగ్రవాద సంస్థలకు ఉన్న విభేదాలకు సంబంధించిన పత్రాలను ప్రపంచం ముందు ఉంచుతున్నాం. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ను సైతం భారత్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది."
- షా మహమ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి.
అయితే షా వ్యాఖ్యలను భారత్ ఖండించింది. పాకిస్థాన్ అంతర్గత కలహాలకు తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. పాక్ ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం ద్వైపాక్షిక పద్ధతికి విరుద్ధం అని గుర్తు చేసింది.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం పాక్ హై కమిషనర్ను పిలిచి నిరసన తెలిపింది.