ఉక్రెయిన్ విమానాన్ని పొరపాటున కూల్చివేయడంపై ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, దుర్ఘటనకు కారకులైన వారిని గుర్తించి శిక్షిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీకి హామీ ఇచ్చారు.
176 మంది అమాయకులు బలి
గత బుధవారం తెల్లవారుజామున టెహ్రాన్ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్కు బయల్దేరిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఉక్రెయిన్ దేశస్థులతో పాటు ఇరాన్కు చెందిన 82 మంది, కెనడాకు చెందిన 63 మంది ప్రయాణికులున్నారు.
శత్రు భయంతో.. పొరపాటు
అనుమానాలు నిజం చేస్తూ... ఉక్రెయిన్ విమానాన్ని తామే కూల్చినట్లు ఇరాన్ మిలిటరీ శనివారం వెల్లడించింది. అయితే ఉద్దేశపూర్వకంగా తాము విమానాన్ని కూల్చలేదని, మానవ తప్పిదం కారణంగానే అలా జరిగిందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విమానం రివల్యూషనరీ గార్డ్స్కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు వచ్చినందున దాన్ని శత్రు దేశపు విమానంగా భావించామని తెలిపింది.
న్యాయం కావాలి
ఇరాన్... ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేయడంపై కెనడా, ఉక్రెయిన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండి: సరికొత్త రికార్డు స్థాయికి విదేశీ మారకపు నిల్వలు