చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో వైరస్ బారిన పడి ఇప్పటి వరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినపడ్డ వారిసంఖ్య 440కి చేరిందని చైనా ప్రకటించింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తమైన చైనా ప్రభుత్వం.. నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది.
మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని చైనా అధికారి జోంగ్ నాన్షాన్ వెల్లడించారు. ఈనేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జనవరి 25న చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు భారీగా రాకపోకలు సాగించే అవకాశం ఉన్నందున వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని... డ్రాగన్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్.. వేరే దేశాలకు వేగంగా పాకుతోంది. దక్షిణ కొరియా, జపాన్, థాయ్లాండ్లో నలుగురికి ఈ వైరస్ సోకింది. తాజాగా అమెరికాలోనూ ఒకరికి కరోనా సోకినట్లు అగ్రరాజ్యం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో అన్ని దేశాలు విమానాశ్రయాలలో ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఇదీ చూడండి: ఎగిసిపడిన సముద్ర అలలు.. నగరాన్ని కమ్మేసిన నురుగు