హాంకాంగ్కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నట్టు అమెరికా చేసిన ప్రకటనపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటుందని.. ఈ చర్యలు తప్పక విఫలమవుతాయని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ పేర్కొంది.
"హాంకాంగ్, చైనా అంతర్గత వ్యవహారాలపై అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. వీటికీ చైనా ప్రజలు భయపడరు. అమెరికా ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయి."
--- పీపుల్స్ డైలీ
హాంకాంగ్ స్వేచ్ఛకు తూట్లు పొడిచేలా తీసుకొచ్చిన జాతీయ భద్రతా బిల్లును చైనా పార్లమెంటు 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' గురువారం ఆమోదించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో బ్రిటన్తో కుదిరిన ఒప్పందానికి చైనా తూట్లు పొడిచిందన్నారు. హాంకాంగ్కు ఇస్తున్న ప్రత్యేక హోదాను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పీపుల్స్ డైలీ ఈ కథనం ప్రచురించింది.
కరోనా వైరస్ వ్యాప్తిపై అమెరికా-చైనా మధ్య ఇప్పటికే ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇప్పుడు హాంకాంగ్ అంశం ఇరుదేశాల మధ్య మరింత అగ్గి రాజేసింది.
భద్రతా మండలి సమావేశంలో...
హాంకాంగ్పై చైనా తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లును అమెరికా, బ్రిటన్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ప్రస్తావించాయి. అనధకారిక వీడియో సమావేశం వేదికగా చైనాపై అమెరికా మండిపడింది.
"మండలి సభ్యులను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. మిలియన్ల మంది హాంకాంగ్ ప్రజలు ఇన్ని రోజులు గౌరవప్రదమైన జీవితాలను గడిపారు. వారి హక్కులను కాపాడేందుకు మనం ఏదైనా చర్యలు తీసుకుంటామా? లేక అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ.. హాంకాంగ్ ప్రజల హక్కులను కాలరాసేందుకు చైనాకు అనుమతులిస్తామా? తమ స్వేచ్ఛను రక్షించాలని హాంకాంగ్ ప్రజలు మనవైపు చూస్తున్నారు. వారి స్వేచ్ఛను హరింపజేసే హక్కును చైనాకు ఇద్దామా?"
--- కెల్లి క్రాఫ్ట్, అమెరికా తరఫున ఐరాస రాయబారి.
ఈ విషయంపైనా చైనా ఘాటుగానే స్పందించింది. అమెరికాలో నల్లజాతీయుడిపై జరిగిన దాడికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం బలగాలను ఉపయోగిస్తోందని.. ముందు ఆ విషయంపై దృష్టి సారించాలని హితవు పలికింది.