అమెరికా, రష్యా అధ్యక్షులు వచ్చే నెలలో భేటీ కానున్నారు. అధ్యక్షుడు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్లు స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా జూన్ 16న ఈ సమావేశం జరగనుందని శ్వేతసౌధం వెల్లడించింది. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అగ్ర నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నాటో సమ్మిట్ కోసం వచ్చే నెలలో బ్రిటన్ వెళ్లనున్న బైడెన్.. ఆ పర్యటన అనంతరం పుతిన్తో సమావేశమవనున్నారు.
ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారని రష్యా సైతం ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా-అమెరికా సంబంధాలు, ప్రపంచంలో ప్రధాన సమస్యలపై అంతర్జాతీయ అజెండా, ప్రాంతీయ సమస్యలు, కరోనా వైరస్పై అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది.
ఎన్నో ఆరోపణలున్నా..
గత ఏడాది జరిగిన అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని అమెరికా ఆరోపించింది. తమ నెట్వర్క్పై రష్యా హ్యాకింగ్ చేసిందని తీవ్రంగా విమర్శించింది. రష్యా ప్రతిపక్షనేత నవాల్ని అరెస్ట్ కు సంబంధించిన విషయంలోనూ పుతిన్ను బైడెన్ తప్పుబట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ రష్యా నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందని అన్నారు. అయినా.. రష్యాతో స్థిరమైన, నమ్మకమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు అమెరికా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించింది.
ఆంక్షల నేపథ్యంలో..
బైడెన్ అధికారంలోకి వచ్చాక మార్చిలో.. రష్యా దౌత్యవేత్తలపై ఆంక్షలు విధించారు. రష్యాకు చెందిన పలు వ్యాపారాలను నిషేధించారు. గత నెలలోనూ 10 మంది రష్యా దౌత్యవేత్తలను అమెరికా నుంచి బహిష్కరించారు. మరోమారు ఆంక్షలను విధిస్తామని ఏప్రిల్లో ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుదేశాల నేతలు భేటీ కానుండడం ప్రాధాన్యం కలిగి ఉంది.
ఇంతకాలానికి..
ప్రపంచ యుద్ధాలు ముగిసిన అనంతరం ఇరు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. తదనంతర కాలంలో 1985న ఇరుదేశాల నేతలు అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, మిఖెల్ గోర్బచేవ్లు మొదటిసారిగా కలుసుకున్నప్పుడు జెనీవానే వేదికయింది.
ఇంత కాలం తర్వాత మళ్లీ ఇరు దేశాల నేతలు జెనీవాలో కలుసుకుంటున్నారు.
ఇదీ చదవండి: 'గాజా పునర్నిర్మాణానికి అమెరికా సాయం.. కానీ'