కరోనా మనుషుల నుంచి జంతువులకు వ్యాప్తిస్తోంది. ఈ క్రమంలోనే ఏనుగులకు, సింహాలకు సోకింది. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా జింకకు కూడా కరోనా సోకినట్లు తెలింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారులు ధ్రువీకరించారు.
కొవిడ్-19కు కారణమయ్యే SARS-CoV-2 వైరస్ను ఒహాయో రాష్ట్రంలోని తెల్ల తోక ఉండే జింకల్లో గుర్తించినట్లు అమెరికాలోని వ్యవసాయ విభాగం తెలిపింది. అయితే కరోనాకు సంబంధించిన లక్షణాలేవీ ఆ జింకలో కనిపించలేదని పేర్కొంది.
జింకకు వైరస్ ఎలా సోకింది అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే అక్కడ ఉండే ప్రజలు, పర్యావరణం, ఇతర జింకల నుంచి కానీ ఇతర జంతువుల నుంచి సోకి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ విషయాన్ని ఓ వార్త సంస్థకు పంపిన ఈ మెయిల్లో వివరించారు.
కుక్క, పులి, సింహం, మంచు చిరుత, నీళ్ల పిల్లి, గొరెల్లా, మింక్ లాంటి జంతు జాతుల్లో వైరస్ ఆనవాళ్లు ఇప్పటికే వెలుగు చూశాయి. మానవులతో సన్నిహితంగా ఉండే జంతువుల్లోనే ఎక్కువ కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: స్పేస్లోకి చీమలు, రొయ్యలు, ఐస్క్రీమ్.. ఎందుకంటే?